తోటకూర మజ్జిగ చారు | ఆంధ్రుల స్పెషల్ తోటకూర మజ్జిగ చారు
"తోటకూర మజ్జిగ చారు" చాలా త్వరగా అయిపోయే కమ్మని ఆంధ్రుల స్పెషల్ రెసిపీ. ఇది నాకు చాలా ఇష్టం. దేశమంతటా మజ్జిగ చారులు ఉన్నాయ్. ఉత్తరాది వారు ఖడి అని తెలుగు వారు మజ్జిగ చారు అంటారు, తమిళ వారు మొరు కొలంబు అంటారు.
తెలుగు వారు మాత్రం దాదాపుగా ప్రతీ కాయ- కూరతో పెరుగుతో పచ్చళ్ళు, చారులు చేస్తుంటారు. అలాంటి పెరుగు పచ్చళ్లల్లో ఇదీ ఒకటి.
ఎప్పుడూ చేసుకునే మజ్జిగ చారు/పులుసుకి బదులు వీటితో చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇది మా ఇంట్లో చాలా ఎక్కువగా చేస్తుంటాము. ఇది చేసిన రోజున ఓ వేపుడు, ఓ రోటి పచ్చడి చేస్తే చాలు. పరిపూర్ణమైన భోజనం అనిపిస్తుంది.
ఆరోగ్యకరమైన పెరుగుపచ్చళ్ళు ఇంకొన్ని:
తోటకూరకి బదులు ముదిరిన తోటకూర కాడలు, బచ్చలికూర, కాబేజీ, మునక్కాడ, బూడిద గుమ్మడి, ముల్లంగి, ముల్లంగి ఆకు, కాలీఫ్లవర్ కాడలుతో కూడా మజ్జిగ పులుసు చేసుకోవచ్చు. ఒక్కోదానిది ఒక్కో రుచి, ఒక్కో ప్రయోజనం.

టిప్స్
• ఈ మజ్జిగ పులుసులో నేను వెల్లూలి వాడాను. నచ్చని వారు వదిలేయోచ్చు.
• అల్లం ఎక్కువగా ఉంటె చాలా తోటకూర మజ్జిగ పులుసు రుచి బాగుంటుంది. కావాలంటే అదీ తగ్గించుకోవచ్చు. కారం వాడడం కంటే, పచ్చిమిర్చి కారం చాలా బాగుంటుంది.
• సహజంగా అందరూ నన్ను మెంతులు చేదుగా ఉంటాయ్ స్కిప్ చేయొచ్చా అని అడుగుతుంటారు. మెంతులు నూనెలో ఎప్పుడూ ముందు వేసి అది కాస్త వేగాక ఆవాలు వేసి, అవీ చిటపటమన్నాక మిగిలిన తాలింపు సామాను వేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. మెంతులు వేగితే రుచి, సువాసన లేదంటే చేదుగా ఉండిపోతుంది.
• పెరుగులో వేడిగా ఉన్న తోటకూర వేస్తే పెరుగూ తరకలుగా ఉంటుంది. అందుకే చల్లార్చిన తరువాత తోటకూర వేసుకోండి.
తోటకూర మజ్జిగ చారు | ఆంధ్రుల స్పెషల్ తోటకూర మజ్జిగ చారు - రెసిపీ వీడియో
Amaranth Kadhi (Butter Milk Stew) | Thotakura Majjiga Pulusu Recipe | Andhra Majjiga Charu Recipe
కావాల్సిన పదార్ధాలు
- 2 తోటకూర- పెద్ద కట్టలు
- 1/2 liter పెరుగు
- 250 ml నీళ్ళు
- 2-3 పచ్చిమిర్చి
- 1 కరివేపాకు
- ఉప్పు
- 1 ఇంచ్ అల్లం
- 5 వెల్లూలి
- 1 tsp ఆవాలు
- 1 tsp జీలకర్ర
- 1/2 tsp మెంతులు
- 1 tsp పచ్చి సెనగపప్పు
- 1 tsp మినపప్పు
- 2 ఎండుమిర్చి
- 1/4 tsp పసుపు
- 2 tsps నూనె
- 1/4 cup నీళ్ళు
విధానం
-
వెల్లూలి, అల్లం కచ్చాపచ్చాగా దంచి పక్కనుంచుకోండి.
-
నూనె వేడి చేసి అందులో మెంతులు వేసి కాస్త వేపి ఆ తరువాత ఆవాలు వేసి చిటచిటలాడించి జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి, ఓ రెబ్బ కరివేపాకు వేసి వేపుకోవాలి.
-
ఆ తరువాత తోటకూర తరుగు, పసుపు, పచ్చిమిర్చి , అల్లం వెల్లూలి ముద్ద వేసి 3-4 నిమిషాల పాటు పసరు వాసన పోయే దాకా ఫ్రై చేసుకోవాలి.
-
4 నిమిషాలకి పసరు వాసన పోతుంది, అప్పుడు కాసిని నీళ్ళు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేం మీద పొడిగా పొడిగా అయ్యేదాకా పూర్తిగా మగ్గనిచ్చి దిమ్పెసుకోండి.
-
పెరుగుని బాగా చిలికి నీళ్ళు, ఉప్పు పోసి కలిపి, చల్లార్చుకున్న తోటకూర వేసి కలుపుకోండి.
-
ఇది అన్నం, చపాతీల్లోకి చాలా బాగుంటుంది.

Leave a comment ×
28 comments