ఇన్స్టంట్ మజ్జిగ పొడి
మిరియాలు శొంఠి ఘాటు, జీలకర్ర, వాము, ధనియాల పరిమళంతో ఉండే ఇన్స్టంట్ మజ్జిగ పొడి వేసి చేసిన మజ్జిగ ఎంతో రుచి ఇంకా శరీరానికి ఎంతో చలువ చేస్తుంది.
రెడీమేడ్ మజ్జిగ పొడి ఒక్కటి చేసుంచుకుంటే చాలు ఇంక ఏమి వేయనవసరం లేదు పెరుగులో పొడి నీళ్లు వేసి చిలికి మజ్జిగ చేసుకుంటే చాలు. సాధారణంగా చప్పటి మజ్జిగ మేలు చేసేదే అయినా రోజూ తాగాలంటే తాగలేరు, ఇలా ఘుమఘుమలాడే ఇన్స్టంట్ మజ్జిగ పొడి వేసి చేసిన మజ్జిగ అయితే ఎన్ని గ్లాసులైనా తాగేయొచ్చు!!!
ఈ మజ్జిగ పొడి వేసిన పలుచని మజ్జిగ రాత్రి భోజనం చేసిన తరువాత పెరుగుకి బదులు తాగితే తిన్నది త్వరగా అరిగి పొట్ట మెత్తబడుతుంది. గ్యాస్ సమస్యలున్నవారికి ఎంతో మేలు చేస్తుంది.
ఈ సింపుల్ పొడికి కొన్ని కచ్చితమైన కొలతలు టిప్స్ చూసి పొడి చేసుకోండి
టిప్స్
మాంచి పరిమళం కోసం:
వేసే ప్రతీ పదార్ధం సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి. సన్నని సెగ మీద వేపితేనే గింజ లోపలి దాకా వేగి మాంచి రుచి సువాసన పొడికి.
కరివేపాకు:
ముదురు నాటు కరివేపాకు కడిగి నీడన ఆరబెట్టినది ఆకులో చెమ్మ ఆరిపోయేదాకా కలుపుతూ వేపుకుని తీసుకోవాలి. మీకు కరివేపాకుకి బదులు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు
శొంఠి-మిరియాలు-వాము :
శొంఠి మిరియాలు వాము నేను చెప్పిన కొలత కచ్చిమైన కొలత ఏ మాత్రం ఎక్కువగా వేసినా పొడి ఘాటుగా అవుతుంది మజ్జిగ తాగక గొంతు మండుతుంది
మెత్తని పొడి కోసం:
పొడి సాధ్యమైనంత మెత్తగా దంచి సన్నని పిండి జల్లెడలో వేసి జల్లించి మెత్తని పొడి తీసుకోవాలి. జల్లించగా మిగిలిన పొడి మళ్ళీ జల్లించాలి. పొడి ఎంత తక్కువ బరకగా ఉంటె అంత బాగుంటుంది మజ్జిగ. మజ్జిగ పొడి బరకగా ఉంటె మజ్జిగ అడుగుకి చేరిపోతుంది పొడి.
శరీరానికి చలువ చేసే మజ్జిగ:
శరీరానికి చలువ చేసే మజ్జిగ అంటే కప్పుకి మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి. అలా చేసిన పలుచని మజ్జిగ అయితేనే శరీరానికి చలువ చేస్తుంది. ఇంకా ఎప్పుడు పెరుగుని పొడి వేసి ముందు చిలికి నీళ్లు పోసుకోవాలి. ముందే పెరుగులో నీళ్లు పోస్తే మజ్జిగ తరకాలుగానే ఉంటుంది.
పొడి ఇలా నిల్వ చేసుకోండి:
పొడి గాలిచొరని డబ్బాలో ఉంచితే కనీసం 2 నెలల పైన తాజాగా ఉంటుంది.
ఇన్స్టంట్ మజ్జిగ పొడి - రెసిపీ వీడియో
Instant Spicy Powder for Buttermilk
- Prep Time 10 mins
- Cook Time 18 mins
- Total Time 28 mins
- Servings 40
కావాల్సిన పదార్ధాలు
- 1/2 cup ధనియాలు
- 1/2 cup జీలకర్ర
- 8 gms శొంఠి
- 1.5 tbsp మిరియాలు
- 1 tbsp వాము
- 7 కరివేపాకు రెబ్బలు
- 1.5 tbsp ఉప్పు
- 1 tsp ఇంగువ
- 1 cup పెరుగు
- 3 cups నీళ్లు (750 ml)
విధానం
- శొంఠిని దంచి పక్కనుంచుకోవాలి.
- కడిగి నీడన ఆరబెట్టినా కరివేపాకులో చెమ్మ ఆరిపోయేదాకా సన్నని సెగ మీద వేపుకోవాలి. తరువాత పక్కనుంచుకోవాలి.
-
మూకుడులో ధనియాలు జీలకర్ర వేసి మాంచి పరిమళం వచ్చేదాకా వేపుకోవాలి.
- వేగిన దినుసుల్లో దంచిన శొంఠి మిరియాలు వాము వేసి సన్నని సెగమీదే వేపుకోవాలి.
- వేగిన దినుసులని ప్లేట్లోకి తీసుకుని ఉప్పు ఇంగువ వేసి బాగా కలిపి పూర్తిగా చల్లార్చాలి. చల్లారిన దినుసులని మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకోండి.
-
గ్రైండ్ చేసుకున్న మెత్తని పొడి జల్లించి ఇంకా మెత్తని పొడి వచ్చేదాకా జల్లించండి. మిగిలిన పొడిని మళ్ళీ జల్లించండి. ఆఖరుగా మిగిలిన చెంచాడు పొడిని మజ్జిగ పొడిలో వేసి కలుపుకోండి.
- గిన్నెలో కప్పు పెరుగు తీసుకోండి ఇందులో tbsp మజ్జిగ పొడి వేసి బాగా చిలుక్కోవాలి. తరువాత తగినన్ని చల్లని నీళ్లు పోసి బాగా చిలికి సర్వ్ చేయండి.
Leave a comment ×
3 comments