రాయలసీమ స్పెషల్ చిట్లం పొడి
సెనగపప్పు, మినపప్పు, కంది పప్పుని వేపి మిరియాలు మిరపకాయలు వేసి మెత్తని పొడిగా దంచి చేసే రాయలసీమ స్పెషల్ పొడి ఇడ్లీ అట్టులోకే కాదు వేడి అన్నం నెయ్యితో ఎంతో రుచిగా ఉంటుంది.
వంట చేసే ఓపిక లేనప్పుడు ఈ పొడి ఒక్కటి ఉంటె చాలు తృప్తిగా భోజనం ముగించొచ్చు. బ్యాచిలర్స్కి ఎంతో ఉపయోగపడుతుంది.
ఆంధ్రాలోని రాయలసీమ, ఇంకా కోస్టల్ ప్రాంతమైన నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా ఈ చిట్లం పొడి చేస్తారు. ఈ పొడి రాయలసీమలో ఏ చిన్న ఇడ్లీ దోశా బండి వాళ్ళదగ్గరైనా కచ్చితంగా దొరుకుతుంది. ఈ చిట్లం పొడి వేయకుండా ఇడ్లీ ఇవ్వరు.
ఎక్కువ నూనె వేసి అట్టుని ఎర్రగా కాల్చి ఈ పొడి చల్లి ఇస్తారు, ఇంకా వేడి ఇడ్లీని నెయ్యితో తడిపి దానిమీద ఇడ్లీ కనపడనంతగా ఈ చిట్లం పొడి చల్లి తింటుంటే ఎన్ని ఇడ్లీలు తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది.
నిజానికి చిట్లం పొడి ఇంటికో తీరులో చేస్తారు చిన్న చిన్న మార్పులతో. కొందరు నేను వేసిన పప్పులు కాక పెసరపప్పు, వేస్తారు ఇంకొందరు ఉలవలు వేస్తారు. నేను అవేవీ వేయలేదు. అసలు చిట్లం పొడి అంటే లేత చింతచిగురు ఉండాలంటారు.
ఇలాగే చిన్న మార్పులతో పొడి చేసుకుంటారు. అవన్నీ నేను కింద టిప్స్లో వివరంగా చెప్పను. మీరు మీకు నచ్చినట్లుగా మార్చుకుని చేసుకోవచ్చు.
టిప్స్
చిట్లం పొడి ఇంకొన్ని తీరుల్లో:
మొదటి తీరు:
చాలా మంది చిట్లం పొడిలో వెల్లులి వేసుకుంటారు. కమ్మని పప్పుల పరిమళాన్ని ఘాటైన వెల్లులి సువాసనతో పోతుందని వేయలేదు. మీకు నచ్చితే మీరు ఈ కొలతకి 15-20 పొట్టుతోనే వెల్లులి పాయలు 30 సెకన్లు వేపుకోండి. వేపుకునన్న పప్పులు ముందు పొడి చేసి ఆ తరువాత ఆఖరున వెల్లులి వేసి 4-5 సార్లు పల్స్ చేసుకోండి.
రెండవ తీరు:
ఉల్లి వెల్లులి తినని కులాల వారు ఇదే పొడిలో వెల్లులి బదులు ఇంగువ, ఇంకా కొద్దిగా బెల్లం వేసుకుంటారు.
మూడవ తీరు:
ఇదే తీరులో పొడి చేసుకోవాలి ఆఖరున లేత చింత చిగురుని సన్నని సెగమీద వేపి మెత్తని పొడి చేసి కలుపుకోవాలి. నచ్చిన తీరులో వెల్లులి లేదా ఇంగువ బెల్లం వేసుకోవచ్చు. కానీ చింతపండు వేయనవసరం లేదు.
పొడి మాంచి రుచి రావాలంటే:
పప్పులు ఒక్కోటిగా నెమ్మదిగా సనన్ని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి. ఇంకా పప్పులు పూర్తిగా చల్లారాక పొడి చేసుకోవాలి
ఇలా గ్రైండ్ చేసుకోవాలి:
ముందు వేపుకున్న మిరపకాయలు మెత్తని పొడి చేసుకున్నాకా మిగిలిన పప్పులు గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మిరకాయలు మెత్తగా గ్రైండ్ అవుతాయి.
కారం ఎక్కువ తక్కువ అయితే:
కారం తక్కువ అయితే మిరపకాయలు వేపి మెత్తని పొడి చేసి పొడిలో కలుపుకోండి. ఎక్కువైతే ఒక్కో పప్పు tbsp చొప్పున తీసుకుని ఎర్రగా వేపి మెత్తని పొడి చేసి కలుపుకోండి. తగినట్లుగా ఉప్పు వేసుకోండి.
రాయలసీమ స్పెషల్ చిట్లం పొడి - రెసిపీ వీడియో
Rayalaseema Special Chitlam Podi
- Prep Time 1 min
- Cook Time 15 mins
- Total Time 16 mins
- Servings 25
కావాల్సిన పదార్ధాలు
- 1/4 cup మినపప్పు
- 1/4 cup పచ్చి సెనగపప్పు
- 1/4 cup కంది పప్పు
- చింతపండు - ఉసిరికాయంత
- 20 - 30 ఎండు మిర్చి
- 1 tbsp మిరియాలు
- 1 tbsp జీలకర్ర
- ఉప్పు - రుచికి సరిపడా
- వెల్లులి - నచ్చితే వేసుకోండి
- ఇంగువ బెల్లం - నచ్చితే వేసుకోండి
విధానం
- మూడు పప్పుల్ని నెమ్మదిగా సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి, అలా వేపితేనే పప్పులు సమానంగా ఒకే తీరుగా వేగుతాయ్. వేగిన పప్పుల్ని ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
- మిరపకాయలని సన్నని సెగ మీద కలుపుతూ వేపుకోవాలి. వేగిన మిర్చిని మరో ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి.
-
మిరియాలు జీలకర్ర వేసి కలుపుతూ జీలకర్ర చిట్లేదాకా వేపుకోవాలి. వేగిన జీలకర్ర మిరియాలని పప్పులలో కలిపేసుకోవాలి.
- చింతపండుని కూడా ముప్పై సెకన్లు వేపుకుని తీసుకోవాలి.
- ముందు మిక్సీలో చల్లారిన మిర్చి ఉప్పు చింతపండు వేసి మిర్చీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-
ఇప్పుడు చల్లారిన పప్పుల్ని మిరియం జీలకర్రని కూడా వేసి మెత్తని పొడి చేసుకోండి.
- నచ్చితే వెల్లులి పొడి గ్రైండ్ అయిన తరువాత వేసి పల్స్ మీద గ్రైండ్ చేసుకుని తీసుకోండి.
- పొడిని గాలి చొరని డబ్బాలో పెట్టి ఉంచుకుంటే రెండు నెలల పైనే నిల్వ ఉంటుంది.
Leave a comment ×
16 comments