తిరువదిరాయ్ కలి
కందిపప్పు పెసరపప్పుని వేపి బియ్యంతో కలిపి రవ్వగా చేసి బెల్లం పాకంలో దగ్గరగా ఉడికించే దాన్ని కలి అంటారు తమిళులు. ఈ కలి ప్రసాదం తమిళనాడు చిదంబర ఆలయంలో నటరాజ స్వామికి కామ సుందరి అమ్మకి ధనుర్మాసంలో వచ్చే ఆరుద్రా నక్షత్రం నాడు ఇంకా పూర్ణిమకి ప్రేత్యేకంగా నివేదన చేస్తారు.
తిరువాదిరై అంటే తమిళంలో ఆరుద్రా నక్షత్రం. ఈ నక్షత్రం మహా శివుని నక్షత్రం. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్రా నక్షత్రం నాడు పార్వతిదేవి కఠోర తపస్సు చేత పరమశివుడిని భర్తగా పొంగలిగింది. అందుకే ధనుర్మాసంలో వచ్చే ఆరుద్రా నక్షత్రం రోజున చిదంరంలోని నటరాజుకి కామసుందరికి వివాహం చేసి ఈ కలి ప్రసాదాన్ని నివేదిస్తారు. అందుకే ఈ ప్రసాదం తిరువాదిరై కలి అయ్యింది.
కమ్మని నెయ్య బెల్లం పాకంలో వండిన పప్పు అన్నం చాలా సులభంగా అయిపోయే కమ్మని ప్రసాదం. ఈ ప్రసాదం మీరు ఏ పండుగకైనా చేసుకోగలిగేలా ఉంటుంది. కలి ప్రసాదం తమిళనాడులో దాదాపుగా అందరికీ తెలుసు ఎంతో ఇష్టంగా పండుగలకు చేసుకుంటుంటారు.
కలి ప్రసాదం చేయడానికి కొన్ని కచ్చితమైన కొలతలు ఉన్నాయ్ అవన్నీ వివరంగా కింద టిప్స్లో ఉన్నాయ్ చుడండి.
టిప్స్
కందిపప్పు & పెసరపప్పు :
పప్పు సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి అప్పుడే మంచి సువాసన.
పప్పులు రెండూ కలిపి తీసుకున్న బియ్యంలో సగం ఉండాలి.
పాకం:
బెల్లం పాకం లేత జిగురు పాకం ఉండాలి అప్పుడే ఉడికిన అన్నం పాకం పీల్చుకుంటుంది, లేదా గట్టిగా అయిపోతుంది.
ప్రసాదం రుచిగా రావాలంటే:
ప్రసాదం చూడ్డానికి అన్నం ఉడికంచి పాకంలో కలిపేయడం లాగానే ఉంటుంది. కానీ ప్రసాదం నెమ్మదిగా కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ దగ్గరగా నిదానంగా అడుగుపెట్టకుండా కలుపుతుంటేనే మాంచి ఎర్రటి రంగులోకి వస్తుంది. చూడ్డానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.
సరైన కొలతలు:
ఈ కలి ప్రసాదానికి బియ్యం, పచ్చికొబ్బరి తురుము, నెయ్యి సమానం ఉండాలి. బెల్లం బియ్యం పప్పుకి కలిపిన దానికి రెండింతలు ఉండాలి.
తిరువదిరాయ్ కలి - రెసిపీ వీడియో
Tiruvadirai kali | Chidambaram Temple Special Prasadam
- Prep Time 5 mins
- Cook Time 30 mins
- Total Time 35 mins
- Servings 12
కావాల్సిన పదార్ధాలు
- 1 cup బియ్యం
- 1/4 cup పెసరపప్పు
- 1/4 cup కందిపప్పు
- 1 cup పచ్చికొబ్బరి తురుము
- 3 cups బెల్లం
- 1 cup నెయ్యి
- 1/2 tsp యాలకలు పొడి
- 2 pinches జాజికాయ పొడి
- 15 జీడిపప్పు
- 15 కిస్మిస్
- 5 cups నీళ్లు
విధానం
- కందిపప్పు పెసరపప్పు వేసి మాంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి.
- వేపుకున్న పప్పు బియ్యం కలిపి మిక్సీలో వేసి గోధుమ రవ్వ అంత సన్నని రవ్వగా గ్రైండ్ చేసుకోండి.
-
కుక్కర్లో 2 tbsp నెయ్యి కరిగించి అందులో రవ్వ వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి.
- రవ్వ రంగు మారాక పావు కప్పు పచ్చికొబ్బరి తురుము వేసి ఒక నిమిషం వేపి మూడు కప్పుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా ఉడికించుకోండి.
- బెల్లంలో మిగిలిన రెండు కప్పుల నీళ్లు పోసి లేత జిగురు పాకం వచ్చేదాకా మరిగించాలి.
-
మరుగుతున్న లేత పాకంలో మెత్తగా వండుకున్న పప్పు అన్నం వేసి గడ్డలు లేకుండా మెదుపుకోవాలి.
- పాకంలో అన్నం కలిసి పోయిన తరువాత మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి జాజికాయ పొడి యాలకుల పొడి వేసి మరో 3-4 నిమిషాలు అడుగుపెట్టకుండా మధ్య మధ్యన కలుపుతూ ఉడికించండి.
- కలిలోంచి నెయ్యి పైకి తేలుతున్నప్పుడు మిగిలిన కొబ్బరి తురుము అంతా వేసి మరో 2 నిమిషాలు ఉడికించి దింపేసుకోండి.
-
మిగిలిన నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేసి పొంగనిచ్చి కలిలో కలిపేసుకోవడమే. ఈ ప్రసాదం వేడిగా చల్లగా ఎలా తీసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. కానీ నెయ్యి తగ్గితే జిగురుగా ఉంటుంది చేతులకి అంటుకుని.
Leave a comment ×
13 comments